ఎంపీ గారి ప్రకటనలో కనిపించని కోణాలెన్నో!

తన వ్యాపార వ్యవహారాలన్నీ ఇక నుంచి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తానన్న విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటన ఆంధ్ర ప్రదేశ్‌

Update: 2023-06-21 02:43 GMT

తన వ్యాపార వ్యవహారాలన్నీ ఇక నుంచి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తానన్న విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటన ఆంధ్ర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఇటీవల ఎంపీ భార్యని, కుమారుడ్ని, అతని స్నేహితుడ్ని కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. కేసును రెండు రోజుల్లోనే విజయవంతంగా ఛేదించామని పోలీసులు చెబుతుండగా, ఎంపీ కుటుంబం కిడ్నాప్‌ వెనుక రియల్‌ ఎస్టేట్‌ కారణాలు ఉన్నాయని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. అసలు అక్కడ కిడ్నాప్ జరగలేదని కేవలం రియల్ ఎస్టేట్ మీటింగ్ జరిగిందని దానికి కిడ్నాప్ ముసుగు వేశారని జనసేనకు చెందిన స్థానిక కార్పొరేటర్ ఆరోపించడం విశేషం

ఈ నేపథ్యంలోనే ఇకపై తన వ్యాపారాలన్నింటినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఎంవీవీ ప్రకటించారు. తాను ఎంపీగా ఉంటూ వ్యాపారం చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకుడిగా విశాఖపట్నంలో ఉంటానని వ్యాపార వ్యవహారాలు మాత్రం షిఫ్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఓ జాగాలో బ్లాస్ట్‌ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకుని 45 రోజులైనా ఇంకా ఫైల్‌ పెండిరగ్‌లోనే ఉందని, హైదరాబాద్‌లో అయితే 48 గంటల్లోనే అనుమతులు వచ్చేవని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ఎన్నో అపార్ట్‌మెంట్‌లు నిర్మించానని, ఓ బిల్డర్‌గా తనకు చాలా మంచి పేరు ఉందని ఆయన తెలిపారు.

తెలుగుదేశం మీడియా దీనిని మామూలుగానే హైలైట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు తరలిపోతున్నారన్నట్లు హడావుడి చేసింది. అయితే ఎంపీ బ్లాస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే.. విశాఖపట్నాన్ని బ్లాస్ట్‌ చేస్తున్నట్లు వార్తలు రాసిన ఈ మీడియానే ఇప్పుడు ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారంటూ, దానికి వైకాపా ప్రభుత్వ విధానాలే కారణమని వార్తలు రాయడం విశేషం. ఇదే మీడియా గతంలో ఎంపీ ఎంవీవీ ప్రాజెక్టుల మీద మొదటి పేజీ కథనాలు ప్రచురించింది. ఎంపీగా ఇక్కడే ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతుననే ఆయన మాటలకి మీడియా పెద్ద ప్రాధాన్యత ఇవ్వడకపోవడం విశేషం. అయితే వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కకపోతే రాజకీయాలను కూడా ఆయన తెలంగాణకు షిఫ్ట్‌ చేస్తారేమో!

Tags:    

Similar News