తూ.గో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. దీనికి ఎందుకింత డిమాండ్ ?

కచ్చిడి చేప పొట్టలో ఉండే తిత్తులను మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారట. సర్జరీ చేశాక కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప..

Update: 2022-03-12 07:21 GMT

పాలకొల్లు : కచ్చిడి.. ఇదో రకం చేప. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని మత్స్యకారులు ఈ రకం చేప పడితే తమ పంట పండినట్లే అని భావిస్తున్నారు. కారణం.. ఆ చేపకు అంత డిమాండ్ ఉంది. ఒకసారి కచ్చిడి చేప వలకు చిక్కిందంటే.. రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ధర పలుకుతుంది. అందులోనూ ఆడ చేప కంటే.. మగ చేపకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుందట.

కచ్చిడి చేప పొట్టలో ఉండే తిత్తులను మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారట. సర్జరీ చేశాక కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేప వలకు చిక్కిందంటే మత్స్యకారులు తమకు బంగారం దొరికినట్లే భావిస్తారు.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 26 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దానిని అమ్మకానికి పెట్టగా.. పాలకొల్లు వ్యాపారులు రూ.79 వేలకు కొనుగోలు చేశారు. తర్వాత ఆ చేపను ఓ ఫిష్ ఎక్స్ పోర్ట్ సెంటర్ కి లక్షన్నర విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేప చైనాకు ఎగుమతి అవుతుందని వ్యాపారి తెలిపాడు.


Tags:    

Similar News