తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

4 రోజులు వరుస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది.

Update: 2022-08-14 01:20 GMT

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత నిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెలవులు, పెళ్లి ముహూర్తాల వల్ల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

4 రోజులు వరుస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూ లైన్ రింగ్ రోడ్డు దాటింది. దర్శనానికి 2 రోజుల సమయం పట్టేట్టు ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు అన్ని నిండి క్యూ లైన్‌ వెలుపలకు వ్యాపించింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండి పోవడంతో ఏటిసి మీదుగా ఎస్‌ఎన్‌సి , లేపాక్షి సర్కిల్‌, షాపింగ్‌ కాంప్లెక్సు, పాత అన్నదానం మీదుగా ఆస్థానం మండపం గుండా వరాహస్వామి అతిథిగృహంను దాటి శ్రీవారి సేవా సదన్‌ వద్దుకు క్యూ లైన్‌ వ్యాపించింది. స్వామివారి దర్శనం కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లలో వేచివున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు నీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.


Tags:    

Similar News