తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ

Update: 2023-08-23 02:35 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 72,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 27,060 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 24, 25వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. మాతృశ్రీ వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల నుండి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 24వ తేదీన ఉదయం 9 గంట‌లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 గంటల‌కు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల‌కు సంగీత స‌భ‌, ఉద‌యం 11.30 గంట‌ల‌కు హ‌రిక‌థ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


Tags:    

Similar News