రద్దీ సాధారణం.. లడ్డూ కౌంటర్లపై టిటిడి కీలక నిర్ణయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం నాడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం

Update: 2023-06-20 02:31 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం నాడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,519 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో రూ. 4.23 కోట్లతో వసతి గృహాలను ఆధునికీకరించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. లడ్డూ విక్రయ కేంద్రాల వద్ద రద్దీ పెరిగిన నేపథ్యంలో రూ. 4.15 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్లను నిర్మించాలని నిర్ణయించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. శ్రీవాణి ట్రస్టు నిధులను ఉపయోగించి కొత్తగా 2,445 ఆలయాలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆలయాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గోశాలల నిర్వహణ, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించిందని అన్నారు. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిందని.. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్సీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.


Tags:    

Similar News