Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ .. శనివారం కూడా ఇదేంటి?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తులు అంతంత మాత్రంగానే ఉంది

Update: 2024-12-14 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం అయినా సరే భక్తులు అంతంత మాత్రంగానే ఉండటం విస్మయం కలిగించే అంశమే. ఎందుకంటే శనివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాల్లో క్యూ లైన్లు బయట వరకూ ఉంటాయి. కానీ నేడు మాత్రం కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా ఉండటం కూడా కనిపించడం ఆశ్చర్యం కనిపిస్తుంది. అయితే తిరుపతి, తిరుమలలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని చెప్పాలి. గత రెండు రోజుల నుంచి తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారింది. కొండ చరియలు విరుచుకుపడే అవకాశముందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాపవినాశనం కూడా మూసివేశారు. ఆకాశగంగ వద్దకు కూడా ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం తగ్గడానికి భారీ వర్షాలే కారణమని అధికారులు చెబుతున్నారు.

వర్షం కారణంగానేనా?
అయితే ఈరోజు పెద్దగా వర్షం లేకపోవడంతో పాటు వాతావరణం సానుకూలంగా ఉండటంతో రానున్న సమయంలో భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం తొమ్మిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయంలో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది.అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,225 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News