టీడీపీ నేత దారుణ హత్య.. రాజకీయ గొడవలే కారణమా ?

వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Update: 2022-01-13 06:21 GMT

గుంటూరు జిల్లాలో టీడీపీ నేత హత్య స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రయ్య అనే టీడీపీ నేత గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్ పై బయల్దేరి బయటికి వెళ్లాడు. అప్పటికే చంద్రయ్య కోసం వేచిచూస్తోన్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్ కు కర్ర అడ్డువేసి కిందపడేలా చేశారు. ఆ తర్వాత అతనిపై కత్తులు, కర్రలతో దాడిచేసి హతమార్చి, అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు చంద్రయ్య హత్యతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా చంద్రయ్యకు రాజకీయ ప్రత్యర్థులతో వివాదాలున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు.
చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. "హత్యా రాజకీయాల వారసుడు @ysjagan సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారింది. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలి. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. " అని పేర్కొంటూ.. నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.


Tags:    

Similar News