Andhra Pradesh : ఏపీలో ఎన్నికలు నాలుగు దశల్లో.. ప్రకటించిన ఎన్నికల కమిషనర్
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. మంగళవారం అమరావతిలోనీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
షెడ్యూల్ విడుదల చేసి...
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలన్న ఎన్నికల కమిషనర్ నవంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయాలని, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని, డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు.