అంబులెన్స్ ను వాడుతున్న లోకల్ 'పుష్ప'

చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ సైరన్ వేసుకుని వేగంగా వెళ్లిపోయి ఎర్రచందనం

Update: 2023-08-04 08:39 GMT

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ అవ్వగా.. దేశంలో ఎక్కడ ఎర్ర చందనం దొరికినా కూడా పుష్ప సినిమాను తలచుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా స్మగ్లింగ్ కోసం కొత్త కొత్త పద్ధతులను వాడుతూ ఈ గ్యాంగ్ లు అడ్డంగా దొరికిపోతూ ఉన్నాయి. ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేయడానికి రోగుల కోసం ఉపయోగించే అంబులెన్సులను వాడాలని అనుకుని.. అడ్డంగా దొరికిపోయారు. చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ సైరన్ వేసుకుని వేగంగా వెళ్లిపోయి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ విషయం టాస్క్ ఫోర్సు పోలీసుల దృష్టికి వచ్చింది. ముందుగా అందిన సమాచారంతో బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద కనిపించాడు. ఇక్కడ ఎందుకు ఉన్నావని అడిగితే అతను సరైన సమాధానం చెప్పక పోవడంతో.. అతనిని తీసుకుని అడవిలోకి ముందుకు వెళ్లారు. అక్కడ ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తూ ఉన్న ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకున్నాడు. అక్కడ నుంచి ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం, గుత్తి మీదుగా తిరుపతి చేరుకున్నారు. అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి పంపిస్తున్నారని విచారణలో తేలింది. బాలపల్లిలో దుంగలు తీసుకుని అంబులెన్సులోకి ఎక్కించే వారు. లక్ష్మీనరసయ్య అనే వ్యక్తి అంబులెన్సుకు డ్రైవరుగా ఉండగా.. ప్రసాద్, మహేష్ అనే వ్యక్తులు రోగులుగా నటిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ వచ్చారు. ఈ స్మగ్లింగ్ వెనుక 14మంది ఉండగా, 10మందిని అరెస్టు చేశారు. వారిలో కడపకు చెందిన నిమ్మల ప్రసాద్ (49), లక్ష్మీ నరసయ్య (47), పొద్దుటూరు జి.సతీష్ కుమార్ (37), తమిళనాడు తిరువన్నామలైకు చెందిన మరిదిరి (61), గోవిందన్ (45), కాళి (49), జీ.సేతు (35), కాశి (35), హరి (25), రాజు మాణిక్యం (40)లుగా గుర్తించారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన దుంగలు, వ్యాను కలిపి సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ మురళీధర్ తెలిపారు.


Tags:    

Similar News