రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనపై వీటికి అనుమతి లేదు

రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు.

Update: 2023-07-24 02:38 GMT

రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. రెండు జిల్లాలకు వారధిగా, రాజమహేంద్రవరం-కొవ్వూరును అనుసంధానిస్తూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం నుండి సరికొత్తగా ఆంక్షలను అమలు చేస్తున్నారు అధికారులు. బస్సులు, లారీలు, లోడ్‌ వాహనాలు గామన్‌ వంతెన మీదుగా వెళ్లాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌, లోడ్‌ వాహనాలు వెళ్లడంతో వంతెన గడ్డర్లు, డెక్‌ జాయింట్లు దెబ్బతింటున్నాయని అధికారులు తెలిపారు. రోడ్లు, భవనాలశాఖ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇకపై వంతెనపై నుంచి కేవలం బైక్‌లు, ఆటోలు, కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. భారీ వాహనాలను అనుమతించమని అధికారులు చెప్పేశారు. ఈ బ్రిడ్జిపై 1974 నుంచి వాహన రాకపోకలు అనుమతించారని.. బ్రిడ్జి జీవితకాలం 65 ఏళ్లుగా నిర్ణయించగా, ఇప్పటికి 49 ఏళ్లు పూర్తయ్యిందని చెప్పారు. ఏపీ వాహన చట్టం ప్రకారం 1988-89 కాలంలోనే ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకల నిషేధం విధించారని అంటున్నారు. ఈ నిషేధం ఎప్పటివరకు అమల్లో ఉంటుందన్నది అధికారులు చెప్పలేదు.


Tags:    

Similar News