వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి మిస్సింగ్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎవరికీ కనిపించలేదని, ఎవరికైనా కనిపిస్తే ఆచూకీ తెలియజేయాలంటూ నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు

Update: 2022-01-19 10:14 GMT

ఓట్లు వేసి గెలిపించేంతవరకూ నేతలు, నాయకురాళ్లు ప్రజల చుట్టూ తిరుగుతారు. తీరా ఎన్నికలై.. గెలుపు వచ్చాక ప్రజలను కనీసం పట్టించుకోరు. అందరూ ఇలానే ఉంటారని చెప్పట్లేదు. కానీ.. కొందరు మాత్రం గెలిచిన తర్వాత ప్రజలతో పనిలేదనుకుంటారో ఏమో.. మచ్చుకైనా కనిపించరు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో పరిస్థితి ఇది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల అయిన తర్వాతి నుంచి ఇప్పటివరకూ నియోజకవర్గంలో ఎవరికీ కనిపించలేదని, ఎవరికైనా కనిపిస్తే ఆచూకీ తెలియజేయాలంటూ నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు అంటించారు.

అంతటితో ఊరుకోకుండా.. సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే పద్మావతి కనిపించడం లేదంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. "ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. శింగనమల ఎమ్మెల్యే గారు. ఎలెక్షన్ టైమ్ లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతిగారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలను పక్కకి నెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు. శింగనమల నియోజకవర్గం" అని పోస్టర్లు ఏర్పాటు చేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లే తాము ఇలా చేయక తప్పలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు.


Tags:    

Similar News