పోసాని రూ. 5 కోట్ల పరిహారం చెల్లించాలి: నారా లోకేష్

మంగళగిరి కోర్టుకు టీడీపీ నేత నారా లోకేష్ హాజరయ్యారు. వైసీపీ నేతలు పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్

Update: 2023-08-18 09:39 GMT

మంగళగిరి కోర్టుకు టీడీపీ నేత నారా లోకేష్ హాజరయ్యారు. వైసీపీ నేతలు పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్ పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కోర్టులను కోరారు. కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారని.. రెండుసార్లు నోటీసులు పంపినా పోసాని స్పందించలేదని లోకేష్ తెలిపారు. వీరికి న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని అన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగించినందుకు కోర్టులో పరువునష్టం కేసు వేశానని చెప్పారు.

కంతేరులో తనకు భూమి ఉన్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని.. తన పరువుకు నష్టం కలిగించినందుకు పోసాని రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశానని, రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. మంగళగిరిలో గెలిచేది తానేనని అన్నారు. తనది కాలేజ్ లైఫ్, జగన్ ది జైల్ లైఫ్ అని లోకేశ్ విమర్శించారు. తనకు క్లాస్ మేట్స్ ఉంటే, జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారన్నారు. తాను విదేశాలకు వెళ్లాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని, జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని లోకేశ్ ఆరోపించారు. తన తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులైనప్పటికీ తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు.
తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్ కొన్నారని పోసాని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా పలు ఆరోపణలు చేశారు. దీంతో వారిపై లోకేశ్ పరువు నష్టం కేసులు వేశారు. దీనిపై పోసాని ఎలా స్పందిస్తారో చూడాలి.


Tags:    

Similar News