బాబు వయసైపోయింది.. కొడుకేమో.! మంత్రి సీరియస్ కామెంట్స్

Update: 2022-09-03 11:04 GMT

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. మూడేళ్లలో జగన్ సర్కార్ రెండు లక్షల కోట్లు అవినీతి చేసిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు లక్షా 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. యుద్ధానికి సిద్ధం కండి.. జైలుకు వెళ్లండి.. కేసులు పెట్టించుకోండి.. కోర్టులో నేను చూసుకుంటాను అంటూ టీడీపీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తున్నాడన్నారు. కార్యకర్తలు జైలుకు వెళ్లాలి.. బాబు, ఆయన కొడుకు మాత్రం ఇంట్లో కూర్చుంటారని ఎద్దేవా చేశారు.

కుప్పంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయి వచ్చాడని రమేష్ విమర్శించారు. కొట్లాడడానికి.. పోరాడడానికి చంద్రబాబుకేమో వయసైపోయిందని.. కొడుకేమో పనికిరాని చవట.. పప్పు.. తుప్పు అంటూ తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీని, చంద్రబాబును మోకులు, జాకీలు, జేసీబీలు, బుల్‌డోజర్లు పెట్టి లేపినా ప్రయోజనం శూన్యమని తేల్చిచెప్పేశారు. తల్లకిందులుగా తపస్సు చేసినా వైఎస్ జగన్‌ను, వైసీపీని కనీసం టచ్ కూడా చేయలేరని ఆయన అన్నారు. ముందు కుప్పంలో నీ గతి ఏమవుతుందో చూసుకో. పులివెందులను టచ్‌ చేసే దమ్ము, ధైర్యం ఉందా? పైపెచ్చు మేకపోతు గాంభీర్యం మాటలు. ఎక్కడ నుంచి పోటీ చేసినా చంద్రబాబు నాయుడు పని ఔట్ అంటూ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. 

Tags:    

Similar News