హెల్మెట్ లేదని లారీ డ్రైవర్ కి ఫైన్.. ఏపీలో పరిస్థితి ఇది !

వాహనదారుడి వద్ద అన్నీ ఉన్నా ఏదొక వంక చూపి, ఫైన్ వేయడం గమనార్హం. బైక్ నడిపే వ్యక్తి వద్ద హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. కానీ..

Update: 2022-04-09 09:41 GMT

చిన్నగంజాం : ఏపీలో జగన్ సర్కార్ పాలనపై ప్రజల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నిన్న ట్విట్టర్లో ఈ పాలన మాకొద్దు.. ఈ నాయకుడు మాకు అక్కర్లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ వేలమంది ప్రజలు ట్వీట్లు వేయడంతో.. #ByeByeYSJagan హ్యాష్ టాగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఒక పక్క నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే.. మరో పక్క విద్యుత్ ఛార్జీలనూ పెంచింది ప్రభుత్వం. ఛార్జీలను పెంచినా కరెంట్ కోతలు ఏమాత్రం తగ్గలేదని వాపోతున్నారు ప్రజలు. అప్రకటిత విద్యుత్ కోతలతో తాముతీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

నిత్యావసరాల ధరలు, పెట్రోల్ - డీజిల్ రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఏదొక ఫైన్లు వేస్తూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతోంది. వాహనదారుడి వద్ద అన్నీ ఉన్నా ఏదొక వంక చూపి, ఫైన్ వేయడం గమనార్హం. బైక్ నడిపే వ్యక్తి వద్ద హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. కానీ.. లారీ డ్రైవర్ కు హెల్మెట్ లేదని పోలీసులు ఫైన్ వేయడంతో ఆశ్చర్యపోవడం డ్రైవర్ వంతైంది. తాజాగా ఈ ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం సమీపంలోని సోపిరాల వద్ద జరిగింది.


 

ఏప్రిల్ 5వ తేదీన సోపిరాల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కోల లక్ష్మణరావు అనే వ్యక్తికి చెందిన లారీని సోదా చేశారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నా.. డ్రైవర్ కు హెల్మెట్ లేదని రూ.135 ఫైన్ వేశారు. ఇదేమిటని అడిగిన డ్రైవర్ కు సరైన సమాధానం దొరకలేదు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ.. పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. లారీ డ్రైవర్ కు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.










Tags:    

Similar News