"నువ్వు క్రిమినల్ వి.. మా దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రివి"

నువ్వు క్రిమినల్ వి జగన్... మా దురదృష్టం కొద్దీ మాకు ముఖ్యమంత్రివి అయ్యావు... ఎస్సైని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్

Update: 2023-07-10 01:58 GMT

ఏలూరులో వారాహి విజయ యాత్ర సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంచివాడా, చెడ్డవాడా అని చూడకుండా, సీఎం స్థానానికి విలువ ఇచ్చి జగన్ రెడ్డి గారు అని గౌరవించానని తెలిపారు. అయితే, ఈ రోజు నుండి అంబేద్కర్ సాక్షిగా జగన్ రెడ్డిని ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు.. అతడి పార్టీ వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని అన్నారు. 2024లో జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. మనమేమీ వైఎస్ జగన్ కు బానిసలం కాదు... ఆయన కూడా మనలో ఒకడే. మనం ట్యాక్సులు కడితే ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి. సీఎం అంటే కేవలం జవాబుదారీ మాత్రమే.. ఈ జగన్ ఎలాంటివాడంటే... నేను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడు. నేను ఏం మాట్లాడినా అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. కానీ ఈ వైసీపీ నేతలు ఏ సంబంధం లేని నా భార్యను, రాజకీయాలు తెలియని నా తల్లిని తిడుతున్నారు. నేను ప్రజల కోసం మాట్లాడుతుంటే, వారు నా కుటుంబాన్ని, ఇంట్లోని ఆడవాళ్లను తిడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నువ్వు క్రిమినల్ వి జగన్... మా దురదృష్టం కొద్దీ మాకు ముఖ్యమంత్రివి అయ్యావు... ఎస్సైని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ మారడమే ఆలస్యం... ప్రతి తప్పు బయటకు తీస్తాం.... నిన్ను ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పేలా చేస్తామని పవన్ అన్నారు. మాట్లాడితే చాలు... ఈ జగన్ నేను హైదరాబాదులో ఉన్నానని అంటాడు. జగన్... నేను మీ నాన్నగారిలా ప్రాజెక్టుల మీద 6 శాతం కమీషన్ దోచుకోలేదు. సీఎం పదవి చాటున వేల కోట్లు దోచుకోలేదు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను జగన్. సినిమాల్లో సంపాదించిన డబ్బును కౌలు రైతులు ఖర్చు పెడుతున్నానని అన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తారనే ప్రెస్ మీట్లు పెట్టడంలేదు. ఓ రాణిలా పరదాల చాటున దాక్కుని వెళతాడు. ముఖం చూపించకుండా ఉండడానికి నువ్వేమైనా రాణివా? అలాంటప్పుడు ఇక్కడెందుకు... వెళ్లి ఇడుపులపాయలో కూర్చో. ఏ గ్రామానికి వెళ్లవు, అలాంటప్పుడు నువ్వు తాడేపల్లిలో ఉంటే ఏంటి, దాచేపల్లిలో ఉంటే ఏంటని ప్రశ్నించారు పవన్.
వారాహి విజయ యాత్ర రెండో దశకు ఏలూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని, దారిపొడవునా అక్కచెల్లెళ్లు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారని అన్నారు. తానేమీ సరదాగా రాజకీయాల్లోకి రాలేదని.. నేను ఇన్ని బాధలు, అవమానాలు ఎందుకు పడాలి? గెలుపోటములతో పనిలేకుండా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.


Tags:    

Similar News