ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు

Update: 2022-10-22 01:21 GMT

రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు దేశం మొత్తం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని, దీనివల్ల గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబరు 23న అల్పపీడనంగా, ఆపై బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 24నాటికి అల్పపీడనం ఉత్తరంవైపు తిరిగి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర-ఈశాన్య దిశగా పయనించి అక్టోబర్ 25న ఒడిశా తీరాన్ని దాటి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఆదివారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్, కేరళ & మాహేలలో ఉరుములు/మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో 23-25 ​​వరకు, పశ్చిమ బెంగాల్‌లో అక్టోబరు 24-26 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ విభాగం. ఒడిశాలో 24న, పశ్చిమ బెంగాల్‌లో అక్టోబరు 25న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో 24 నుండి 26వ తేదీ వరకు.. అరుణాచల్ ప్రదేశ్‌లో అక్టోబర్ 25న విస్తారంగా తేలికపాటి / మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 25, 26 తేదీల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అక్టోబరు 21 నుండి 23 వరకు అండమాన్-నికోబార్ దీవులలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News