నారాయణ కుమార్తెలు, అల్లుడికి ముందస్తు బెయిల్ మంజూరు

Update: 2022-05-16 12:58 GMT

అమరావతి : 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో మాజీ మంత్రి పి.నారాయణ ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, మరికొందరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ గ్రూపు విద్యాసంస్థలకు చెందిన నారాయణ కుమార్తె పి.శరణి, పి.సింధూర, అల్లుడు కె.పునీత్‌తో పాటు మరో 10 మందికి ముందస్తు బెయిల్‌ లభించింది. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణలపై చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె పునీత్‌ సహా మరికొందరు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషిన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లపై ఈ నెల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వారు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు, వారిపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు మే 18కి వాయిదా వేసింది.

ఈ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు నారాయణ గత వారం అరెస్టయ్యారు. చిత్తూరు పోలీసుల బృందం మే 10న హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. మే 11న తెల్లవారుజామున చిత్తూరులోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నారాయణ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన మేజిస్ట్రేట్ నారాయణకు బెయిల్ మంజూరు చేశారు.
ఏప్రిల్‌ 27న జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి చిత్తూరు పట్టణంలో నమోదైన కేసులో నారాయణతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యులేట్ అయింది. ఏప్రిల్ 27న తెలుగు భాష ప్రశ్నపత్రం సర్క్యులేషన్‌పై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నారాయణ అరెస్ట్ నేపథ్యంలో నారాయణ గ్రూపుతో సంబంధం ఉన్న ఆయన కుమార్తెలు, అల్లుడు తదితరులు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.


Tags:    

Similar News