పరిటాలకు కేతిరెడ్డి ఆల్‌ ది బెస్ట్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి సవాల్ విసిరారు

Update: 2023-04-07 02:38 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి సవాల్ విసిరారు. లోకేష్ తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలపై మరోసారి ఘాటుగా స్పందించారు. తన పేరుతో భూములు కబ్జా చేసి ఉంటే వారిని చెప్పుతో కొట్టాలని, అది అబద్ధమని తేలితే ఆరోపణలు చేసినవారిని దేనితో కొట్టాలని కేతిరెడ్డి ప్రశ్నించారు. ముందు చెరువు కబ్జా అన్నారని, తర్వాత 45 ఎకరాలు అన్నారని, 2014 గూగుల్ మ్యాప్ చూపించి జనాల్ని నమ్మించాలని చూస్తున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. ముదిగుబ్బలో తన అనుచరులు కబ్జా చేసి ఉంటే వారు ఎక్కడైనా సంతకం పెడతారని, ఆ భూములు ప్రభుత్వం తీసుకోవచ్చని చెప్పారు.

పరిటాల హీరో అయింది....
ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బోర్డులు పెట్టించిందే తానని చెప్పారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. తన పేరు ఎక్కడైనా ఉపయోగిస్తే ఈడ్చి కొడతానని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాకి వచ్చి లోకేష్ రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తన తాత ఖర్జూర్ నాయుడు అని చెప్పుకోకుండా ఎన్టీఆర్ అని లోకేశ్ ఎందుకు చెప్పుకుంటున్నాడని ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్ ఏమైనా కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి వచ్చారా అంటూ సెటైర్లు వేశారు. వారు అనంతపురం, రాప్తాడులో చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. కమ్మ వాళ్లలో పరిటాల రవి మాత్రమే హత్య చేయబడ్డారని, అందుకే ఆయన హీరో అయ్యారు తప్ప వేరే ఏమీ లేదన్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఫ్యాక్షన్ కారణంగా సందుకు ఇద్దరు చనిపోయారని కేతిరెడ్డి చెప్పారు. పరిటాల శ్రీరామ్‌కు టీడీపీ నుంచి టికెట్ కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ చెప్పారు కేతిరెడ్డి.


Tags:    

Similar News