Andhra Pradesh : సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. భూ కేటాయింపులివే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

Update: 2025-07-05 12:12 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాజధాని అమరావతిలో మరో ఇరవై వేల ఎకరాలను అదనంగా సమీకరించాలని నిర్ణయించింది. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఏడు గ్రామాల్లో భూసమీకరణకు సంబంధించి రైతులు అంగీకరించారని, మిగిలిన గ్రామాల్లో దశల వారీగా భూములను సమీకరిస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ గతంలో 2018 మాస్టర్ ప్లాన్,డిజైన్ లకు ఆలస్యం కావడం తో నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ఈసారి అమరావతి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. భూసమీకరణ అంశంలో వైసీపీ నాయకులు కొన్ని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, జగన్ మళ్లీ వస్తాడని అనుమానం ఏ మాత్రం అవసరం లేదని, రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4 , తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ , మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.

క్రికెట్ అకాడమీకి...
అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపిందని, మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన అమోదం చెప్పిందన్నారు. అమరావతి లో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక రేటు పెరగడంతో డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చామన్న నారాయణ ప్రకాశం బ్యారేజి ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనాఉందని, భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిందని, రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని నారాయణ తెలిపారు.


Tags:    

Similar News