వైఎస్సార్ రైతు భరోసా.. రైతుల ఖాతాల్లోకి రూ.23,875 కోట్లు జమ : సీఎం జగన్

గతంలో ఎన్నడూ లేని విధంగా.. తమ ప్రభుత్వం రైతులకు లక్షా 10 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎం చెప్పారు. గడిచిన మూడేళ్లలో..

Update: 2022-05-16 08:27 GMT

ఏలూరు : వైఎస్సార్ రైతు భరోసా పదకం కింద ఇప్పటివరకూ.. రైతన్నల ఖాతాల్లోకి రూ.23,875 కోట్లను జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖరీఫ్ పనులు పూర్తి కాకముందే రైతుల ఖాతాల్లోకి రూ.5,500 నగదు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా రైతులకు ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 అందిస్తోందన్నారు. మే నెలలో రూ.7500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు ఇస్తున్నామన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా.. తమ ప్రభుత్వం రైతులకు లక్షా 10 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎం చెప్పారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో కరవు లేదన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటలు బాగా పండినట్లు తెలిపారు. రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ యాత్ర చేస్తున్నారు కానీ.. ఇంతవరకూ పరిహారం అందని ఒక్కరైతునూ చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సిన సమయంలో వదిలేసి.. ఇప్పుడు బాబుపై అమితమైన ప్రేమను ఒలకపోస్తున్నారన్నారు.
ఏపీ ప్రజలు ఇప్పటికైనా.. గత ప్రభుత్వానికి - మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సిపి రైతులకు అండగా ఉంటుందని, ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందని చెప్పారు.


Tags:    

Similar News