Andhra Pradesh : గుడ్ న్యూస్.. ఏపీలో ఉచిత ఇంటి స్థలం కావాలా? అయితే ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలాలు పేదలకు పంచేందుకు సిద్ధమయింది. ఇందుకోసం విధివిధానాలను నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలాలు పేదలకు పంచేందుకు సిద్ధమయింది. ఇందుకోసం విధివిధానాలను నిర్ణయించింది. జీవో నెంబరు 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలు పొందాలంటే అర్హతలు కొన్ని ఉండాలని, అర్హత కలిగిన వారికి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో గరిష్టంగా మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే తాజాగా మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కేటాయించే స్థలంలో ఇంటి నిర్మాణానికి కూడా అవసరమైన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అర్హతలివే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయించనున్నారు. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటమే కాకుండా లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలి. కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారు. . ఇప్పటికే భూమి ఉన్నవారికి కేటాయింపు జరగదు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి . ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కారని మార్గదర్శకాల్లో పేర్కొంది.
రెండు సంవత్సరాల్లోనే...
అలాగే మైనర్లకు ఉచిత స్థలం ఇవ్వరు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే స్థలాన్ని కేటాయిస్తారు. స్థలం లేని చోట ఏపీటీఐడీసీఓ మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇంటి స్థలం లభిస్తుంది. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థలం కేటాయించిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఇంటిని నిర్మించుకోవాలి.ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. . స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలని, ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పట్టా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని పేర్కొంది.
అభ్యంతరాలను...
గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలని, ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. . అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. కుటుంబ ఆదాయం రూరల్ ఏరియాలో 10,000 పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపల ఉండాలి. అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయించాలి. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చేందుకు వీలుంది.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.