గ్రామాలన్నీ చెరువులయ్యాయ్

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఈరోజు సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది.

Update: 2022-07-14 02:57 GMT

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 15.97 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ శశిభూషణ్ వరద ప్రభావిత జిల్లాలకు సూచనలు చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే అనే మండలాలపై ప్రభావం చూపుతుందని, ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ విపత్తుతల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తెలిపారు.

40 గ్రామాలకు...
కోనసీమలోని 40 లంక గ్రామాలకు గోదావరి జలాలు చేరాయి. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తుండటంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ లంకలో 13 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే అధికారులు లంక గ్రామాల ప్రజల్లో అత్యధికుల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత వరద పెరిగితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాలన్నీ చెరువులుగా కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News