ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో మంత్రి లోకేశ్ భేటీ వారిలో ఆనందాన్ని పంచింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబసభ్యులతో తన ఇంటికి ఆహ్వానించి, ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటుచేసి, మాటలు-ముచ్చట్లతో గడిపే సరికొత్త సంప్రదాయానికిమంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో గురువారం రాత్రి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కుటుంబసభ్యులతో తన ఇంటికి విందుకు ఆహ్వానించారు లోకేశ్. ఈ సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. అంతా ఒకేచోట కూర్చుని భోజనం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించిన లోకేశ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఆత్మీయంగా మాటలు కలిపారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో...
ఎటువంటి రాజకీయ చర్చలకు తావులేకుండా పూర్తిగా కుటుంబంలో జరిగే శుభకార్యంలా నిర్వహించారు. తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి చేనేత కళాకారులు నేసిన పట్టుచీరలు బహుకరించారు. పార్లమెంటు సమావేశాల్లో ఉండటంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (జనసేన), అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ ఆత్మీయ కలయికకు హాజరు కాలేదు. మంత్రి-మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ (జనసేన), పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కుటుంబసభ్యులతో తరలివచ్చి ఆత్మీయ కలయికలో ఆనందంగా గడిపారు.