నిశ్చితార్థంలో దారుణం.. తల్వార్లు, కత్తులతో దాడులు

Update: 2018-04-02 03:55 GMT

హైదరాబాద్ పాతబస్తీలోని షాగంజ్ తరీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం వేడుకల్లో మునిగితేలుతున్నారు వధూవరుల బంధుమిత్రులు. అంతలో రౌడీమూకలు ఫంక్షన్ హాల్లో జొరబడ్డాయి. తల్వార్లు, కత్తులతో విరుచుకుబడి ఓ వ్యక్తిని హత్య చేశాయి. మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీఆలం షాగంజ్ తరీఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ ఘటన. పాతబస్తీలోని పలు ఫంక్షన్ హాళ్లు రక్తసిక్తమవుతున్నాయ్.. తరచూ కత్తిపోట్లు, దాడులు, హత్యల కోసం ఫంక్షన్ హాళ్లను వాడుకుంటున్నారు కిరాతకులు..షేక్ ఇమాం తన కుమార్తె వివాహ నిశ్చితార్థం వేడుకల్ని షాగంజ్ తరిఖత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం అర్థరాత్రి నిర్వహిస్తున్నారు. అంతా సందడి వాతావరణంగా సాగుతోంది. అష్వాక్ అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో భోజనం వడ్డించడం లేదంటూ కేటరింగ్ బాయ్స్ పై కేకలు పెట్టసాగాడు. వారించిన పెళ్లివారితో అష్వాక్ గొడవకు దిగాడు. బయటకు వెళ్లిన అతను కాసేపటికి 20 మంది వ్యక్తులతో ఫంక్షన్ హాల్ కు తిరిగొచ్చాడు. ఫంక్షన్ హాల్లోకి జొరబడ్డారు. అక్కడ ఫంక్షన్ హాళ్లల్లోని టేబుళ్లను పడేసి..కుర్చీలను విసిరేశారు. భోజనం గిన్నెలు, వంటపాత్రలు చెల్లాచెదురుగా పడేసి వీరంగం సృష్టించారు. అడ్డుకునేందుకు యత్నించిన జామే నిజామియా ప్రాంతానికి చెందిన మహ్మద్ అన్వర్ పై కత్తులతో దాడి చేసి.. హత్య చేశారు. దూద్ బౌలికి చెందిన సోహెల్ ని మారణాయుధాలతో పొడవడంతో.. అతని పరిస్థితి విషమంగా మారింది. ఫంక్షన్ హాల్లోని వధువరుల బంధువులంతా ఉస్మానియా ఆసుపత్రికి తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హత్యకు గురైన అన్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సోహెల్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు వైద్యులు. హత్య, దాడులకు పాల్పడ్డ నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు.

Similar News