వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-08-20 12:42 GMT

చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం విశాఖపట్నం జిల్లా కోటవురట్లలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు ఇప్పటికే బీజేపీని, టీఆర్ఎస్ ను, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలను వివాహం చేసుకుని వదిలేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, స్వయంగా చంద్రబాబు కుటుంబసభ్యులనే రాయబారానికి పంపించారని విమర్శించారు. ‘‘సిగ్గులేని వాడు’’ అనే బిరుదు ఉంటే అది చంద్రబాబుకే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సింగపూర్ తరహా రాజధాని కడాతనని చెబుతున్న చంద్రబాబు లంచాల వల్ల కట్టడాలు దిగజారిపోయాయని ఆరోపించారు. బయట 3 సె.మి వర్షం కురిస్తే సచివాలయంలో 6 సె.మీల నీరు కనిపిస్తోందని, సీలింగులు ఊడిపోతున్నాయని విమర్శించారు.

ఆయన ఘనకీర్తి అదే...

చంద్రబాబు నాలుగేళ్లుగా సాధించిన ఘనత కేవలం అవినీతి, అన్యాయం, దుబారా మాత్రమేనని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రూ.6 కోట్ల దుబారా చేశారని, ఆ సొమ్మును అధికారంలోకి రాగానే పోలవరానికి కేటాయించి ఉంటే ఈపాటికి పూర్తయ్యి నీరు వచ్చేదని అన్నారు. అక్రమ మైనింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు డాన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మెడికల్ కాలేజీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ కు వ్యాట్ కి తోడు లీటరుకు రూ.4 లోకేష్ పాకెట్ మనీగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ బాండ్లు 8.9 వడ్డీ రేటుకు, పుణే బాండ్ల ద్వారా 7.59 శాతం వడ్డీకి బాండ్లను తీసుకువస్తే చంద్రబాబు మాత్రం బాండ్ల రూపంలో 10.32 శాతం వడ్డీకి తీసుకువచ్చారని, పదేళ్లలో ఇది 2 వేల కోట్ల అదనపు బారం పడుతుందన్నారు.

Similar News