అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ ల బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన అసెంబ్లీ గౌరవాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ స్పీకర్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కోమటిరెడ్డి, సంపత్ కుమార్లు హైకోర్టును ఆశ్రయించగా, వీరి సభ్యత్వాన్ని కొనసాగించాలని సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపై 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అప్పీల్ వేయించారు. ఈ అప్పీల్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీల్ ను కొట్టివేసింది. దీంతో టీఆర్ఎస్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.