తిత్లీ దెబ్బకు సిక్కోలు విలవిల

Update: 2018-10-11 04:04 GMT

తిత్లీ తుఫాను దెబ్బకు సిక్కోుల విలవిల లాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఈరోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు వద్ద తీరం దాటింది. తిత్లీ తుపాను తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో కొబ్బరిచెట్లు, జీడితోటల నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు యాభై కిలోమీటర్ల వరకూ తుపాను ప్రభావం విస్తరించింది. ప్రధానంగా ఉద్దానం ప్రాంతం తుపాను ధాటికి అల్లాడిపోయింది. తుపాను తీరం దాటిన తర్వాత దాదాపు 15 నుంచి 20 సెంటీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతున్నారు. సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, ఉమిలాడ, సున్నాపల్లి, భావనపాడు తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

చంద్రబాబు నేడు అక్కడే ఉండి........

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు తిత్లీ తుపాను పరిస్థితిని సమీక్షించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తుపాను సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లి అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈరాత్రికి శ్రీకాకుళం జిల్లాలోనే చంద్రబాబు బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లల్లోనుంచి ప్రజలు బయటకు రావద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. తిత్లీ తుపాను ప్రభావంతో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతింది. తిత్లీ తపాను విద్వసం ఈరోజు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముందంటున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే మూడు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Similar News