మోడీ లడ్డూ....తిన్నారు....!

Update: 2018-07-31 09:41 GMT

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం విశేషం. వేదికపై మోదీ, అమిత్ షాలతో పాటు బీజీపీ సీనియర్ నేత అద్వానీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ లు కూడా వేదికపై ఆశీనులు కావడం విశేషం. తమలో ఐక్యత ఉందని తెలియజెప్పడానికే వేదికపై అందరికీ చోటు కల్పించారంటున్నారు.

ఐక్యత చాటిచెప్పేందుకేనా?

సుష్మాస్వరాజ్, అద్వానీ, రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ లు ప్రధాని మోదీని పూలమాలలతో సత్కరించారు. ఇటీవల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ మోదీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం అర్థంలేనిదని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ సందర్భంగా మరోసంఘటన కూడా చోటు చేసుకుంది. యూపీకి చెందిన దళిత ఎంపీ అశోక్ డోహ్రే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చవద్దంటూ ప్రధానికి లేఖ రాశారు. అయితే ఈ సమావేశంలో అశోక్ డోహ్రే ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించబోయారు. అయితే మోదీ ఆయనను వారించారు.

Similar News