లోకేశ్ మళ్లీ వేశాడోచ్....!

Update: 2018-05-30 02:08 GMT

చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలి, నారా లోకేశ్ కి అన్ని అర్హతలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి కావాలని మహానాడు వేదికగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు. జేసీ మాత్రమే కాదు, ఆ పార్టీ నేతలు అప్పుడప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే, వారు చెప్పినట్లుగానే లోకేశ్ కి అన్ని అర్హతలు ఉండవచ్చు కానీ, ఆయన ప్రసంగాలు మాత్రం అనేకసార్లు నవ్వులపాలై సోషల్ మీడియా ట్రోల్ అయ్యాయి. గతంలో అవినీతి, కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒకసారి, పొరపాటున కూడా టీడీపీకి ఓటేస్తే మీ గొంతుమీరే కొసుకున్నట్లే అని మరోసారి తన ప్రసంగాల్లో చెప్పి తర్వాత నాలుక్కరుచుకున్నారు. అయితే, తాజాగా విజయవాడలో జరిగిన మహానాడులోనూ ఇదే విధంగా ప్రసంగించి సోషల్ మీడియాలో మళ్లీ ట్రోల్ అవుతున్నారు. ఆయన ఏమన్నారంటే... కార్పోరేటర్లుగా కూడా గెలవని వారిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అని గొప్పగా చెప్పారు. దీనిని బట్టి కార్పోరేటర్ గానే గెలవలేని వారిని తాము ఎమ్మెల్యేలను చేశామని స్వయంగా ఒప్పుకున్నట్లయింది. అయితే, ఇది నారా లోకేశ్ కి కూడా వర్తిస్తుందని కొందరు కామెంట్లు చేశారు. ఆయన కూడా ప్రజల చేత ఎన్నిక కాకముందే ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టారుగా అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News