ఆమెను చంపింది వాడే

Update: 2018-04-07 09:33 GMT

ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన గృహిణి సౌమ్య హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె భర్త నాగభూషణం స్నేహితుడు ప్రకాష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డ సమీపంలో నందనగర్‌లోని సూరజ్‌ ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే నాగభూషణం భార్య సౌమ్య సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమెను కత్తితో పొడిచి నూనె పోసి నిప్పుపెట్టినట్లు గుర్తించారు. ఏడాదిన్నర వయసున్న ఆమె కుమారుణ్ని అదే గదిలోనే ఉంచి బయట నుంచి గడియపెట్టినట్లు తెలుసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసేందుకు నిందితుడు ఆమె ఫోన్‌ను ఫ్లష్‌ ట్యాంకులో పడేశాడు. దీంతో కేసు దర్యాప్తు నెమ్మదించింది. ఈ నేపథ్యంలో కేసును ఛేదించేందుకు పోలీసులు పెద్ద కసరత్తే చేశారు.

ఇద్దరూ స్నేహితులే....

ఎస్సార్‌నగర్‌, టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, క్లూస్‌ టీం బృందాలు రాత్రింబవళ్లు శ్రమించాయి. చివరకు ఆమె గత ఫోన్‌ కాల్స్‌, సందేశాల చిట్టా ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చారు. వాటి ద్వారానే.. నాగభూషణం స్నేహితుడు, గతంలో సహోద్యోగి అయిన అనంతపురానికి చెందిన ప్రకాష్‌ను ఎస్సార్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు... ప్రకాష్‌, నాగభూషణం మంచి స్నేహితులు. నాగభూషణం బీటెక్‌, ప్రకాష్‌ డిప్లొమా చదివారు. గతంలో అసోంలో ఇద్దరు కలిసి నాలుగేళ్లు పనిచేశారు. అక్కడ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహానికి దారితీసింది. ప్రస్తుతం మెట్రో ఎల్‌అండ్‌టీలో నాగభూషణం పనిచేస్తుండగా ప్రకాష్‌ పట్నాలో పనిచేస్తున్నాడు. ప్రకాష్‌ తరచూ నాగభూషణం ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో సౌమ్య, ప్రకాష్‌ మధ్య కూడా స్నేహం ఏర్పడింది. సాన్నిహిత్యానికి దారితీసింది. హత్య జరిగిన రోజు రాత్రి కూడా నాగభూషణం, ప్రకాష్‌ కలిసి ఇంట్లోనే మద్యం తాగి భోజనాలు చేశారు. తరవాత ఇద్దరూ బయటకు వెళ్లిపోగా రాత్రికి ప్రకాష్‌ తిరిగి వచ్చాడు. డబ్బు విషయమై సౌమ్య, ప్రకాష్‌ మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలిసింది. పెనుగులాటలో ఆమె తలకు గాయమవడంతో కేకలు వేయబోయింది. భయపడిన ప్రకాష్‌ కత్తితో ఆమె గొంతు కోశాడు. బతికితే తనకు ప్రమాదమని భావించి, నూనె పోసి నిప్పంటించి తలుపునకు గడియపెట్టి పరారయ్యాడు. ఈ హత్యోదంతం విషయమై ఈ రోజు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది

Similar News