మోడీ హత్యకు కుట్ర..?

Update: 2018-06-08 09:59 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతుందా..? మావోయిస్టులే ఈ కుట్రను పన్నుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు పుణే పోలీసులు. మావోయిస్టు పార్టీతో లింకులున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో ఈ కుట్ర కోణం బయటకు వచ్చిందని అంటున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహా లో నరేంద్ర మోడీని కూడా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు రుజువుగా ఓ లేఖను కూడా పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇటీవల మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింస ఘటనలో రోనా జాకబ్ విల్సన్, సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేవ్ రౌత్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఇళ్లు, వస్తువులను పోలీసులు సోదా చేయగా, జాకబ్ విల్సన్ ఇంటివద్ద ఓ లేఖ దొరికింది. మోదీని హత్య చేయాల్సిన అవసరం, హత్య చేసే విధానంపై అతడు మావోయిస్టులకు రాసినట్లుగా ఈ లేఖ ఉంది.

రాజీవ్ ని చంపినట్లుగానే....

మోదీ పరిపాలనను అంతం చేయాలంటే, ఆయనను హతమార్చాలని లేఖలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్యకు అనుసరించిన విధానంతోనే మోదీని హతమార్చాలని, కానీ, ఇది విఫలమయ్యే అవకశాలు ఎక్కువగా ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ మావోయిస్టు స్లీపర్ సెల్స్ పార్టీ పెద్దలకు రాసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల ఐసిస్ ఉగ్రసంస్థ కూడా నరేంద్ర మోడీని చంపేందుకు ప్రయత్నించగా, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ ఈ కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.

Similar News