కూకట్ పల్లిలో టీడీపీ నేత వద్ద డబ్బు సంచులు

Update: 2018-12-06 03:28 GMT

కూకట్ పల్లిలో ఎలాగైనా విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని విజయం కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు గత పక్షం రోజుల నుంచి ఇక్కడే మకాం వేశారు. ఏపీ ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావుకూడా కూకట్ పల్లిలో సుహాసిని విజయం కోసం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర్ నివాసం వద్ద పెద్దయెత్తున నగదు లభించడం చర్చనీయాంశమైంది.

జూపూడి ఇంటివద్ద.....

నిన్న రాత్రి జూపూడి నివాసానికి ముగ్గురు యువకులు వచ్చారు. అయితే జూపూడి వాహనాన్ని గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారు డబ్బు మూటలతో వచ్చినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం మూడు సంచులతో వచ్చిన ఆ యువకులను పట్టుకునే ప్రయత్నం చేయబోగా అందులో ఇద్దరు యువకులు పారిపోయారు. ఒక వ్యక్తిని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. వారు తెచ్చిన బ్యాగుల్లో పదిహేడున్నర లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. అయితే తాను టీడీపీ నేతను కావడం, దళిత వర్గానికి చెందిన వాడిని కావడంతోనే తమపై దాడులు చేస్తున్నారని జూపూడి ఆరోపించారు.

Similar News