ఆంధ్రాలోనూ వేలు పెడతాం..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-12-01 09:01 GMT

రాజకీయంగా చంద్రబాబు సంగతి తేల్చడానికి అవసరమైతే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా వేలు పెట్టేందుకు వెనకాడరని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నేనేమీ తప్పు చేశానని చంద్రబాబు శుద్దపూసలా మాట్లాడి అమాయకంగా నటిస్తే నడవదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు కాదా అని, ఫోన్ లో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడింది ఆయన కాదా అని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా ఫోన్ లో మాట్లాడిన గొంతు నాది కాదు అని చంద్రబాబు ఎందుకు చెప్పాలేదన్నారు.

ఓడిపోయే సీటెందుకు ఇచ్చారు..?

నాలుగున్నరేళ్లు కులమతాలకు అతీతంగా తెలంగాణ ఉందని, కానీ ఇప్పుడు కులం, మతం, ప్రాంతం ఆధారంగా చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే తిప్పికొడతామన్నారు. సుహాసినిపై అంత ప్రేమ ఉంటే తన కుమారుడిని చేసినట్లుగా ఏపీలో ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఓడిపోయే సీటు ఆమెకు ఇవ్వడం వెనుక నందమూరి కుటుంబం రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్ర ఉన్న సంగతి అందరికీ తెలుసన్నారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్త్రీ అనే చెప్పుకునే చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయనే ఫస్ట్ అని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు హైదరాబాద్ కట్టానన్నారని, ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తే సైబరాబాద్ కట్టానంటున్నారని పేర్కొన్నారు.

Similar News