టీడీపీపై జీవీఎల్ సంచలన ఆరోపణలు

Update: 2018-06-25 06:50 GMT

కడప స్టీల్ ప్లాంటును అడ్డుకుంటోంది చంద్రబాబు నాయుడేనని, స్టీల్ ప్లాంట్ ప్లాన్ పై సమాచారం కేంద్రం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో టీడీపీ నేతలు చేస్తున్నవి దొంగ దీక్షలని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు వస్తున్నా బీజేపీపై టీడీపీ అసత్యపు ప్రచారం చేస్తుందన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ పథకాలను టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. హౌజింగ్ స్కీమ్ కింద ఇప్పటికి 7 లక్షల 42 వేల ఇళ్లను కేటాయించామని, ఇందుకోసం రూ.3,202 కోట్లను ఏపీకి మంజూరు చేశామని తెలిపారు.

ఆ నిధులు ఏం చేశారు?

ఈ నిధులు చంద్రబాబు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన స్పందించకపోతే ఈ అంశంపై విచారణ కోరతామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,100 సరిపోతుందని, 2,400 అవసరం లేదన్నారు. ఇళ్లు కేటాయించేందుకు పేదల నుంచి ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి లక్ష వరకు దోచుకుంటున్నారని, టీడీపీ నేతలకే ఎక్కువగా మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎవరితోనూ పొత్తు లేదని, అన్ని పార్టీలూ తమకు రాజకీయ ప్రత్యర్థులేనని ఆయన స్పష్టం చేశారు.

Similar News