డేటా చోరీ కేసులో సంచలన విషయాలు చెప్పిన సీపీ

ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన వివరాలను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. డేటా చోరీ కేసుపై ఆయన సోమవారం [more]

Update: 2019-03-04 10:28 GMT

ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన వివరాలను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. డేటా చోరీ కేసుపై ఆయన సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వర్ రెడ్డి అనే డేటా అనలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుపై తాము మూడు రోజుల క్రితం విచారణ ప్రారంభించామని తెలిపారు. ఐటీ గ్రిడ్ లోని నలుగురు ఉద్యోగుల సమక్షంలో విచారణ జరపగా.. ఈ సంస్థ వద్ద ఆధార్, ఓటర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, కులం, ఏ పార్టీకి చెందిన వారు వంటి వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎవరెవరు ఏయే స్కీమ్ లలో లబ్ధిదారులు, ఏ పార్టీ వారు అనేది ఈ డేటా ద్వారా అనలైజ్ చేస్తున్నారని వివరించారు. దీని ద్వారా ఓటర్లను తొలగిస్తున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ కేసు విచారణకు నాలుగు బృందాలను వేశామని, ఈ సంస్థ డేటాను భద్రపరుస్తున్న అమెజాన్ సర్వీసెస్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సంఘానికి కూడా ఉత్తరం రాస్తామన్నారు.

ఏపీ పోలీసుల తీరు సరికాదు

వ్యక్తిగత, సెన్సిటీవ్ డేటా ఈ సంస్థ దుర్వినియోగం చేస్తున్నందున దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కు నోటీసులు ఇచ్చామని, వెంటనే విచారణకు హాజరుకావాలని తెలిపారు. లేకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందన్నారు. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసుల తీరు సరిగా లేదని ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్ ఉద్యోగి భాస్కర్ తమవద్దే ఉంటే పెద్దకాకానిలో మధ్యాహ్నం 5.30 గంటలకు మిస్సింగ్ కేసు పెట్టారని, వెంటనే ఏసీపీ, ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులు మూడున్నర గంటల్లోనే హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక మిస్సింగ్ కేసులో ఏసీపీ స్థాయి అధికారులు అంతత్వరగా ఎలా హైదరాబాద్ వచ్చారన్నారు. తమవద్దే సాక్షులుగా ఉన్నారని చెప్పిన కేసును పక్కదారి పట్టించేందుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారని తెలిపారు. తమపై ఎటువంటి ఒత్తిడి లేదని, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామన్నారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డికి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు బెదిరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై కే.పీ.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. తమపైన ఎవరు అబద్దపు ఆరోపణలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ చట్టం ఆధారంగా ప్రజల వ్యక్తిగత డేటా ఐటీ గ్రిడ్ కంపెనీకి ఇచ్చారని ప్రశ్నించారు. లబ్ధిదారుల డేటా కూడా ఉంది కాబట్టి ప్రభుత్వాన్నే అనుమానించాల్సి వస్తుందన్నారు. కంపెనీ ఇక్కడ, డేటా ఇక్కడ ఉంటే ఇక్కడే విచారణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న నేరస్తులనే పట్టుకొస్తున్నామని, పక్క రాష్ట్రంలో దాక్కుంటే పట్టుకు రాలేమా అని అని పేర్కొన్నారు.

Tags:    

Similar News