రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టేలా బీజేపీ నేతలతో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసలు విషయంపై సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. జరిగిన సంఘటనపై సంజాయిషీ ఇవ్వకుండా నోటీసులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.సౌత్ ఎవెన్యూలోని రాంమాధవ్ ఇంటికి మీరెళ్లినట్లు కారు డ్రైవర్ చెబుతున్నారని, లాగ్బుక్లో కూడా నమోదైందని, ఢిల్లీలో బీజీపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ఒకేకారులో వెళ్లి రాంమాధవ్ను కలిశారా లేదా అనేదానిపై ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు? అని ప్రశ్నించారు. బుగ్గన విమానాశ్రయానికే నేరుగా వెళ్లకుండా మధ్యలో రాంమాధవ్ను కలవలేదా? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా రాజేంద్రనాథ్రెడ్డి ప్రవర్తన ఉందని కనకమేడల అభిప్రాయపడ్డారు.
ప్రజలకు సమాధానం చెప్పకుండా.....
ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన అంశాలను గాలికి వదిలేసి.. తప్పును ఎత్తిచూపిన వారిపై ఫిర్యాదు చేస్తామని చెప్పడం వారి దివాలకోరుతనానికి నిదర్శనమన్నారు. లాగ్బుక్ను ట్యాంపరింగ్ చేశారంటూ వింతవాదన చేస్తున్నారని, ఢిల్లీలో ఆకుల, బుగ్గన కలిసి రాంమాధవ్తో సమావేశం అయినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఆకుల సత్యనారాయణ, బుగ్గన విభిన్నమైన వాదనలు తీయడం అనుమానాలకు మరింత బలమిస్తోందన్నారు. ఎదురుదాడి చేయడం మాని మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలన్నారు. పీఏసీ ఛైర్మన్ హోదాలో మీరున్నారనే విషయాన్ని మరచి వ్యవహరిస్తున్నారన్నారు. విజ్ఞతతో వ్యవహరించి ప్రజలకు సమాధానం చెప్పాలని, ఎంత బుకాయించినా ప్రజాకోర్టులో వైసీపీకి శిక్ష తప్పదని కనకమేడల హెచ్చరించారు. కాగా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. రహస్య పత్రాలను అందించిన బుగ్గనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. బుగ్గన సభాహక్కులను ఉల్లంఘించారని స్పీకర్ కు వివరించారు.