మాట్లాడానంతే.. చేతల వరకూ వెళ్లలేదు

అవినీతిపై మాట్లాడితే అంత భయమెందుకని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

Update: 2022-09-18 06:23 GMT

అవినీతిపై మాట్లాడితే అంత భయమెందుకని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. తనను ఎక్కడికి రమ్మన్నా వస్తానని, చర్చకు సిద్ధమా? అని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత బిడ్డలుగా మీరు పోరాడాల్సిన పనిలేదా? అని ఆమె ప్రశ్నించారు. ఒక మహిళను కలసి కట్టుగా తనను ఎదుర్కొనలేక తనపై ఫిర్యాదు చేస్తారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేసే దమ్ముందా మీకు అని ప్రశ్నించారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు...
మంత్రులు, ఎమ్మెల్యేలు తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కుట్ర జరుగుతుందని ఆమె అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు తాను మాటలతో ఆపానని చేతల వరకూ వెళ్లలేదని తెలిపారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణాలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని షర్మిల మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ విసిరారు. నిరుద్యోగులు, రైతులు పడుతున్న ఇబ్బందులు మీ కంటికి కనపడవా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు సిద్ధపడే దమ్ముందా? అని ఆమె ప్రశ్నించారు. ఒక మహిళ అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని వైఎస్ షర్మిల అన్నారు.


Tags:    

Similar News