కాంగ్రెస్‌లో కొలిక్కి రాని సీట్ల పంచాయతీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత వేడెక్కుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు

Update: 2023-10-09 04:21 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత వేడెక్కుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు దూకుడు పెంచారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ కూడా అభ్యర్థుల జాబితా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే త్వరగానే కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే చెబుతున్నారు. ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు మాణిక్‌రావు ఠాక్రే. ఇదిలా ఉంటే.. ఈలోగా టికెట్లు ఆశిస్తున్నవారు ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలక షెడ్యూల్‌ నేడు ప్రకటిస్తారని తెలియడంతో హస్తం పార్టీ అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా తయారు కాలేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్‌ మొదలైంది. నేరుగా అధిష్టానంతోనే తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట ఓయూ జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. కనీసం 5 సీట్లు అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు వాపోయారు. ఓయూ జేఏసీ నేతల ధర్నాతో కాంగ్రెస్‌ పెద్దలు కదిలారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మాటిచ్చారు. అటు అన్ని స్థానాల అభ్యర్థులపై చర్చ జరిగిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఈసీ నిర్ణయం మేరకు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. వారంలోగా జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

సీట్ల కేటాయింపు పంచాయతీ

ఇక కాంగ్రెస్‌లో సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలంటూ వినతి పత్రాలు అందజేశారు. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్‌ నేతలు కూడా తమకు కనీసం 25 టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో టికెట్ల పంచాయతీ కాంగ్రెస్‌ అధిష్టానానికి సవాలుగా మారింది. అటు ఢిల్లీలో కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. అభ్యర్ధుల ఎంపికపై 8 గంటల పాటు సమావేశంలో చర్చించారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామని, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు.


Tags:    

Similar News