నీట మునిగి గూగుల్ ఉద్యోగుల మృతి.. మద్యం మత్తులోనా..?

సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అక్షయ్ వెంకట్(28)

Update: 2022-05-23 04:38 GMT

సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అక్షయ్ వెంకట్(28), బోయినపల్లికి చెందిన రాజన్ శర్మ(28) మృతి చెందారు. హైదరాబాద్‌ కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వడ్లమూలి అక్షయ వెంకట్, సికింద్రాబాద్‌ బోయినపల్లిలోని మల్లికార్జున కాలనీకి చెందిన రాజన్‌శర్మ లు గూగుల్‌ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఆదివారం వీరిద్దరు రాంకోటికి చెందిన మరో మిత్రుడు రిషబ్‌షాతో కలిసి కారులో సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండల పరిధిలోని కొండపోచమ్మ జలాశయానికి వచ్చారు. ఉదయం 6 గంటలకు ఈత కొడదామని అక్షయ వెంకట్‌, రాజన్‌శర్మలు జలాశయంలోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయారు. ఒడ్డున ఉన్న రిషబ్‌షా మిత్రులిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించారు. వారు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభించాయి. ఘటనాస్థలంలో మద్యం సీసాలు ఉండడంతో మృతులు తాగి మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి ఉంటారని ములుగు ఎస్సై రంగ కృష్ణగౌడ్‌ తెలిపారు.

మరో ఘటన:
మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల నాగమణి సోదరుడు మెదక్‌ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన గంగారాం (34).. భార్య మంగమ్మ, పిల్లలతో కలిసి తిమ్మాయిపల్లికి జాతర కోసం వచ్చారు. నాగమణి సోదరి సుశీల కుమారుడు దేవరాయ లక్ష్మణ్‌ (18) తన తల్లి, సోదరితో కలిసి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. సుశీల అనారోగ్యంతో ఉన్నప్పుడు తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో పల్లె పోచమ్మకు మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకునేందుకు ఆదివారం అందరూ కలిసి వెళ్లారు. గ్రామ సమీపంలోని గిద్ద కుంటలోకి కుటుంబ సభ్యులందరూ కలిసి స్నానం చేద్దామని దిగారు. ఈ క్రమంలో గంగారాం, లక్ష్మణ్‌లు కాస్త ముందుకు వెళ్లడంతో లోతు తెలియక నీట మునిగారు. బంధువులు వారిని కాపాడేందుకు చీర అందించినా ప్రయత్నం ఫలించలేదు. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈతగాళ్ల సాయంతో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి.


Tags:    

Similar News