మునుగోడు ఉప ఎన్నిక: ఛేజింగ్ చేసి కారును పట్టుకున్న పోలీసులు

Update: 2022-10-23 02:15 GMT

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. శనివారం మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద మరో రూ.1 కోటి నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉందని భావిస్తున్న కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. వీరితో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మణికొండలోని ఓ విల్లా నుంచి రూ.1 కోటి నగదును మునుగోడులో ఉన్న సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డిలకు అందజేసేందుకు నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. నార్సింగి రోటరీ వద్దకు రాగానే పోలీసులు కనిపించడంతో వీరు కారు వేగాన్ని పెంచారు. అనుమానించిన పోలీసులు వీరిని వెంబడించి మరీ కారును పట్టుకున్నారు. కారును సోదా చేయగా అందులో రూ.1 కోటి నగదు బయటపడింది. నగదుతో పాటు కారులోని నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో పోలీసులు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులను దేవరాజు, శ్రీకాంత్‌, విజయ్ కుమార్‌, నాగేశ్, దాసరి లూథర్‌గా పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News