Telangana : గుడ్ న్యూస్...తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ లో తెలంగాణకు గుడ్ న్యూస్ లభించింది.

Update: 2026-01-21 02:18 GMT

దావోస్ లో తెలంగాణకు గుడ్ న్యూస్ లభించింది. ప్రతిష్టాత్మకమైన సంస్థ గూగుల్ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఆసక్తికి కనబర్చింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్‌ భద్రత అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని గూగుల్ ఆసియా పసిఫిక్‌ విభాగం హామీ ఇచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా గూగుల్ ఏపాక్‌ అధ్యక్షుడు సంజయ్‌ గుప్తాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. విజన్ డాక్యుమెంట్ ను తెలియజేశారు.

ఈ రంగాల్లో సహకారానికి...
ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి రూపొందించిన ‘క్యూర్‌, ప్యూర్‌, రేర్‌’ ఫ్రేమ్‌వర్క్‌ను, హైదరాబాద్‌ కేంద్ర ప్రాంతాన్ని కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలను ఆయన తెలియజేశారు. సంజయ్‌ గుప్తా స్పందిస్తూ ట్రాఫిక్‌ నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు రంగాల్లో తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో తొలి ‘గూగుల్ ఫర్ స్టార్టప్్స్ హబ్’ ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో కలిసి పని చేస్తామన్న గూగుల్
యూనిలివర్ తో...
అదే సమయంలో యూనిలీవర్‌ గ్లోబల్‌ సప్లై చైన్‌, ఆపరేషన్స్‌ చీఫ్‌ విలెమ్‌ ఉయెన్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణలో గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. జీసీసీలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా హైదరాబాద్‌ వేగంగా ఎదుగుతున్న తీరు వివరించారు. ఈ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని ఉయెన్‌ తెలిపారు.హెల్త్‌ టెక్నాలజీ సంస్థ రాయల్‌ ఫిలిప్స్‌ కూడా తెలంగాణతో ఏఐ రంగంలో భాగస్వామ్యం కావాలని ఆసక్తిని వ్యక్తం చేసింది. నెదర్లాండ్స్‌లోని తమ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందాన్ని సంస్థ ఆహ్వానించింది.
ఆరోగ్య రంగంలో...
ఫిలిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెడ్‌జాన్‌ విలెమ్‌–షైగ్రాండ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.తెలంగాణ ఔషధ తయారీ, ఆర్‌ అండ్‌ డీ రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను నిర్మిస్తోందని సీఎం తెలిపారు. “ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏఐ ఆధారిత మార్పు ఆకట్టుకునేలా ఉంది. మా ప్రధాన కార్యాలయానికి ‘తెలంగాణ రైజింగ్’ బృందాన్ని ఆహ్వానిస్తున్నాం,” అని షైగ్రాండ్‌ చెప్పారు. తొలిరోజు గూగుల్ తో పాటు పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన సమావేశాలు విజయవంతమయ్యాయి.


Tags:    

Similar News