కీలక విజయాన్ని అందుకున్న కేకేఆర్

ఐదు వరుస పరాజయాల తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Update: 2022-05-03 03:18 GMT

ఐదు వరుస పరాజయాల తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడింది. మొదట రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 16 పరుగులకే అరోన్ ఫించ్ (4) వికెట్‌ను, 32 పరుగుల వద్ద బాబా ఇంద్రజిత్ (15) వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులు చేయగా, నితీశ్ రాణా 48, రింకు సింగ్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను కోల్‌కతా బౌలర్లు 152 పరుగులకు కట్టడి చేశారు. వికెట్లు చేతిలో ఉన్నా భారీ స్కోరు సాధించడంలో ఆర్ఆర్ బ్యాటర్లు సక్సెస్ అవ్వలేకపోయారు. కెప్టెన్ సంజు శాంసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ 22, కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19, హెట్మెయిర్ 27 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో సౌథీకి రెండు వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివం మావీ తలా ఓ వికెట్ పడగొట్టారు. 23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేసిన కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


Similar News