ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎట్టకేలకు ముంబై బౌలర్లు రాణించి రాయల్స్‌ను 158

Update: 2022-05-01 04:01 GMT

ముంబై : 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే వరుసగా దారుణమైన ఓటములను అందుకుంది రోహిత్ శర్మ సేన..! బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా అన్నింటిలోనూ దారుణంగా విఫలమవుతూ విజయాలన్నవే చూడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ జట్టు విజయాన్ని అందుకుంది. ఎనిమిది మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత.. తొమ్మిదో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎట్టకేలకు ముంబై బౌలర్లు రాణించి రాయల్స్‌ను 158 పరుగులకే కట్టడి చేయగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ.. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు పరుగులు సాధించడంతో ముంబై విజయం సాధించింది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. జోస్ బట్లర్ ఒక్కడే రాణించి 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అతడి తర్వాత అశ్విన్ చేసిన 21 పరుగులే అత్యధికం. పడిక్కల్ 15, కెప్టెన్ సంజు శాంసన్ 16, డరిల్ మిచెల్ 17 పరుగులు చేశారు. ఛేజింగ్ లో బర్త్ డే బాయ్, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బాగా ఆడుతాడని అనుకుంటే మరోసారి విఫలమయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. తిలక్ వర్మ 35, కీరన్ పొలార్డ్ 10 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేయగా, డేనియల్ శామ్స్ ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.


Tags:    

Similar News