రజత్ సెంచరీ.. ఆఖర్లో హర్షల్ పటేల్.. ఆర్సీబీ ముందుకు

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Update: 2022-05-26 03:18 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫయర్-2కు చేరింది. రజత్ పటీదార్ సూపర్ సెంచరీ చేయడంతో కోల్‌కతాలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుతుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ (25) ఈసారి నిరాశపరిచాడు. రజత్ పటీదార్ ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేశాడు. 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మ్యాక్స్‌వెల్ 9, లోమ్రోర్ 14 విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
లక్నో 208 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు పోరాడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసినప్పటికీ.. ఆఖర్లో ఫినిషింగ్ చేయలేకపోయారు. దీపక్ హుడా 26 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలింది. డికాక్ (6), మనన్ వోహ్రా (19), స్టోయినిస్ (9), ఎవిన్ లూయిస్ (2), కృనాల్ పాండ్యా (0) విఫలమయ్యాయి. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పటీదార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆఖర్లో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది.


Tags:    

Similar News