Diwali : దీపావళి పండగ ఇందుకొచ్చిందట... అందుకే అలా చేస్తారు

దీపావళి పండగ ఏటా ఆశ్వీయుజ మాసంలో వస్తుంది. దీపావళిని చిన్న పిల్ల నుంచి పెద్దల వరకూ అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

Update: 2023-11-08 11:35 GMT

ఆశ్వీయుజ మాసం వచ్చిందంటే చాలు... పిల్లల నుంచి పెద్దలతో సహా అందరూ సంతోషంగా ఉంటారు. దానికి కారణం ఈ మాసంలో వచ్చే దీపావళి పండగ. దీపావళి పండగ ఏటా ఆశ్వీయుజ మాసంలో వస్తుంది. దీపావళిని చిన్న పిల్ల నుంచి పెద్దల వరకూ అందరూ ఆనందంగా జరుపుకుంటారు. నోరూరించే మిఠాయిలతో పాటు పేలే టపాసులు ప్రతి చోటా దర్శనమిస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ అత్యంత ఇష్టమైన పండగ దీపావళి అని అంటారు.

పురాణ కథల ప్రకారం...
దీపావళి పండగ వచ్చిందంటే చాలు కొత్తబట్టలు కుట్టించుకుని రాత్రికి బాణాసంచా పేల్చడం ఆనవాయితీగా వస్తుంది. నరకాసురుడిని సత్యభామ వధించిన రోజును దీపావళిగా దేశమంతటా చేసుకుంటుంది. పురాణాల్లో అదే చెప్పారు. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం పూర్వ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సముద్రంలోకి భూమిని పడేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి నరసింహావతారమెత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. ఆ సమయంలో పుట్టిన పుత్రుడిలో రాక్షస లక్షణాలు వచ్చాయని భూదేవికి విష్ణుమూర్తి చెబుతాడు. అయితే విష్ణుమూర్తి చేతిలో తన బిడ్డ హతమవుతాడని భావించిన భూదేవి తన బిడ్డకు ప్రాణబిక్ష పెట్టమని వరాన్ని పొందుతుంది. అందుకు విష్ణుమూర్తి సరేనని అంగీకరించి అతడి మరణం కన్న తల్లి చేతుల్లోనే ఉందని చెబుతాడు. తన బిడ్డకు ఆ విష్ణుదేవుడి నుంచి అపాయం లేదని భావించిన భూదేవి సంతోషిస్తుంది.
నరకాసురుడి దండయాత్ర...
ఆ బిడ్డ నరకాసురిడిగా మారి జనరంజక పాలన చేస్తుంటాడు. కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యితిష్ట్యపుర రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్య దేవిని పూజించే నరకాసురుడి బాణాసురినితో స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతడు పూర్తిగా ప్రజల మీద దాడులు చేసి మహిళలను బలవంతంగా లోబర్చుకుంటుంటాడు. ప్రజలను కాల్చుకు తింటుంటాడు. చివరకు స్వర్గం మీద కూడా దండయాత్ర చేస్తాడు. కన్నతల్లి అయిన ఆదితి మాత చెవికుండలాలను దోచుకుని దేవతలను అవమానపర్చేలా వ్యవహరిస్తాడు. దీంతో దేవతలు కూడా భయపడిపోతారు. తమను నరకాసురుడి నుంచి కాపాడాలని విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుడిని వేడుకుంటారు.
సంహరించిన రోజున...
అయితే భూదేవి సత్యభామ అవతారమెత్తి శ్రీకృష్ణుడిని వివాహమాడుతుంది. దీంతో తన పూర్వజన్మకు సంబంధించిన సంఘటనలు ఏవీ ఆమెకు గుర్తుకు ఉండవు. దీంతో సత్యభామ నరకాసురుడితో యుద్ధానికి తాను వస్తానని శ్రీకృష్ణుడిని కోరుకుంటుంది. అదే అదనుగా భావించిన శ్రీకృష్ణుడు వెంటనే అంగీకరించి తన వెంట తీసుకెళతాడు. శ్రీకృష్ణుడికి, నరకాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్ఛబోయినట్లు నటిస్తాడు. దీనికి ఆగ్రహించిన సత్యభామ వెంటనే తన బాణంతో నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ విధంగా తల్లి చేతుల్లో నరకాసురుడు మరణిస్తాడు. నరకాసురుడు చనిపోయిన రోజున నరక చతుర్ధశిగా పిలుస్తారు. ఆరోజు బాణాసంచాలు పేల్చి ప్రజలంతా పండగ చేసుకుంటారు. ఇది పురాణాలు చెప్పే కథే అయినా దీపావళి పండగ కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తుంటారు.


Tags:    

Similar News