Diwali : వెలుగు దివ్వెల దీపావళి...ఆనందాల లోగిలి
నేడు దీపావళి పండగ. వెలుగుల పండగగా భావించే దీపావళి నేడు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు
నేడు దీపావళి పండగ. వెలుగుల పండగగా భావించే దీపావళి నేడు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. అమావాస్య రోజున వచ్చే దీపావళి రోజున ఉదయాన్నే స్నానమాచరించి ఆలయాల్లో పూజలు నిర్వహించుకుంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి ప్రసాదంగా పంచుతారు. ఈ పండగకు టపాసులు సాయంత్రం వేళ ఎంత ముఖ్యమో నోరు తీపి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఈరోజు ప్రతి ఇళ్లలో మిఠాయిలు తయారు చేసుకుంటారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది స్వీట్ షాపుల నుంచి కొనుగోలు చేసి పని భారం తగ్గించుకుంటున్నారు.
అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని...
లక్షీ దేవిని పూజించి తమకు తమ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు. ఉదయాన్నే లేచి తలారా స్నానమాచరించి శుద్ధిగా వంటలు చేసి లక్ష్మీదేవికి సమర్పించుకుంటారు. రాక్షసుడు నరకాసురుడిని సత్యభామ వధించిన రోజు కావడంతో అందరూ ఆనందంగా ఈ పండగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఇంటిల్లిపాది ఒకచోట చేరి వేడుకగా ఈ పండగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకూ తెలియని హుషారు. అందుకే దీపావళికి ఉన్న ప్రత్యేకత మరే పండగకు ఉండదు. పండగకు కొత్త అల్లుళ్లు రావడంతో ఇల్లు మరింత పండగ శోభను సంతరించుకుంటుంది.
దీపాలు.. టపాసులు...
సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి వెలుగులు నిండిపోతాయి. ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. బాణా సంచా కాలుస్తూ రాత్రి పది గంటల వరకూ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో గడుపుతారు. దీపావళి అంటే సత్యభామ నరకాసురుడిని వధించిన రోజు కావడంతో రాక్షస సంహారం జరిగిందని భావించి పూర్వ కాలం నుంచి దీపావళిని ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఈరోజు కూడా దేశమంతా వెలుగులతో నిండిపోతుంది. అయితే కాలుష్యం పెరిగిపోతుందని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ సంస్కృతి సంప్రదాయాలను విస్మరించడం సరికాదని భావించి ఈ పండగను దేశమంతా జరుపుకుంటారు.