Ys Jagan : జగన్ పర్యటనలు ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్ లో ఎలా ఉంటాయో?
వైసీపీ అధినేత జగన్ పర్యటనలు అంటేనే టెన్షన్ మధ్య సాగుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ పర్యటనలు అంటేనే టెన్షన్ మధ్య సాగుతున్నాయి. నిజానికి ఇది కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు స్థానిక పోలీసులకు కూడా తలనొప్పిగా తయారయింది. జగన్ జిల్లాలకు వస్తున్నారంటే పోలీసులతో పాటు సిబ్బంది కూడా భయపడిపోతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలుచేసినా బేఖాతరు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ వివిధ వర్గాల సమస్యలపై జిల్లాలను పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనలు వరసగా వివాదం అవుతుండటం, ఏదో ఒక అనుకోని ఘటనలు జరుగుతుండటంతో శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టం రిగిపోతూనే ఉంది.
సమస్యలను పరిష్కరించలేని...
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి సమస్యలను అడ్రస్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అధికారంలో ఉన్నప్పుడు కనపడని సమస్యలు అధికారం లేనప్పుడు కనిపిస్తాయి. అది చంద్రబాబుకు అయినా.. జగన్ కు అయినా అంతే. కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ప్రతిపక్ష నేతలు అక్కడకు వెళ్లి పరామర్శించి తాము ఉన్నామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి ప్రతిపక్ష నేతలు ఎవరు ఎన్ని పర్యటనలు చేసినా ఆ సమస్యలు పరిష్కారం కావు. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే సమస్యలను పరిష్కరించేందుకు అవకాశముంటుంది. అది గిట్టుబాటు ధరలైనా? మరొకటైనా పవర్ లో ఉన్న పార్టీ స్పందిస్తేనే అనుకూలమైన నిర్ణయం వస్తుంది.
ప్రయోజనం ఏముంటుంది?
అది తెలిసినా ప్రజలు మాత్రం ప్రతిపక్ష నేతలు తమ వద్దకు వస్తే బాహ్య ప్రపంచానికి తెలుస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు మిర్చి రైతుల సమస్యలపై గిట్టుబాటు ధరలు రావడం లేదని జగన్ గుంటూరు పర్యటనలు చేశారు. తర్వాత కొంత అధికార పార్టీలో హడావిడి కనిపించింది. ఆ సమస్య మళ్లీ ఇక కనిపించలేదు. ఇక పొగాకు కు మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఇబ్బందులు పడుతుండటంతో జగన్ పొదిల పర్యటన చేపట్టారు. తర్వాత కేంద్ర మంత్రి వచ్చి పొగాకు బోర్డును సందర్శించి వెళ్లారు. తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందో లేదో తెలియదు. ఇప్పుడు జగన్ బంగారు పాళ్యం పర్యటనలోనూ మామిడి రైతులు పరామర్శించారు. అయితే ఇది కూడా నాలుగు రోజుల తర్వాత అంతే.
శాంతి భద్రతల సమస్యగా...
కానీ జగన్ పర్యటనల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పొదిలి పర్యటనలో టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. దీనిపై జగన్ తో పాటు పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈరోజు తాజాగా బంగారుపాళ్యం ఘటనలో కార్యకర్తలు పోలీసుల లాఠీఛార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. జగన్ పర్యటనలు కొన్ని రోజుల ముందు హైటెన్షన్ మధ్య కొనసాగుతుండటంతో పోలీసులకు తలనొప్పిగా తయారయ్యాయి. అలాగని పర్యటనలకు అడ్డు చెప్పలేరు. నిబంధనలు పెట్టినా అమలు కావు. మరి మరో నాలుగేళ్లు ఇలాగే కొనసాగాల్సిందేనా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.