మునుగుతున్న లంక గ్రామాలు

గోదావరికి మళ్లీ వదర పోటెత్తింది. కోనసీమలో లంక గ్రామాలు ఇప్పటికే కొన్ని మునిగాయి

Update: 2022-08-12 02:44 GMT

గోదావరికి మళ్లీ వదర పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. కోనసీమలో లంక గ్రామాలు ఇప్పటికే కొన్ని మునిగాయి. 118 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని విపత్తు సంస్థ అధికారులు వెల్లడించారు. గ్రామాలను వదలి పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వచ్చారు. ఇక ప్రభుత్వం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తోంది. కొన్ని రహదారులు వరద నీటితో నిండిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత నెలలోనే వచ్చిన వరద కారణంగా ఇబ్బంది పడిన ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు.

ప్రకాశం బరాజ్ వద్ద...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లకు వెళ్లలేక, తమ గ్రామాల్లో పెళ్లిళ్లు జరుపుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక పులిచింతల నుంచి ప్రకాశం బరాజ్ వరకూ వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బరాజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 3.37 క్యూసెక్కులు ఉండగా, పులిచింతల ప్రాజెక్టు వద్ద ఔట్ ఫ్లో 4.36 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుంది. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అధికారులు వారిని అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.


Tags:    

Similar News