IPl 2024 : శభాష్.. నితీష్ రెడ్డి.. ఊరు పేరు నిలబెట్టావుగా

పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు కుర్రోడు మన నితీష్ రెడ్డి

Update: 2024-04-10 04:13 GMT

ఐపీఎల్ లో తెలుగు కుర్రోళ్లు మెరిసిపోతున్నారు. ఐపీఎల్ పుణ్యమా అని మనోళ్ల సత్తా ఏంటో సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నిన్న తిలక్ వర్మ... నేడు నితీష్ రెడ్డి.. ఇలా దూసుకుపోతున్నారు. ఎటూ సిరాజ్ బౌలర్ గా స్థిరపడిపోయాడు. అంబటి రాయుడు లాంటి వాళ్లు అదును చూసి కొట్టే షాట్లు ఐపీఎల్‌కే హైలెట్ గా మారేవి. కానీ మరో మెరుపు హైదరాబాద్ నుంచి కనిపించింది. అదీ హైదరాబాద్ జట్టులోనే. నిన్న పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు కుర్రోడు. మన నితీష్ రెడ్డి.

విశాఖకు చెందిన...
ఇంతకీ ఎవరీ నితీష్ రెడ్డి అంటే.. విశాఖకు చెందిన నితీష్ రెడ్డి 2003 లో జన్మించాడు. అతని తండ్రి ముత్యాలరెడ్డి హిందూస్థాన్ జింక్ లో పనిచేసి పదవీ విరమణ చేశఆడు. 14 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన నితీష్ రెడ్డి తర్వాత అండర్ 16లోకి అడుగుపెట్టాడు. ఆంధ్ర జట్టు తరుపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన నితీష్ రెడ్డిని హైదరాబాద్ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ేకేవలం ఇరవై లక్షలకే కొనుగోలు చేసింది ఆ జట్టు యాజమాన్యం. కానీ ఈరోజు జట్టు గెలుపునకు కారణమయ్యాడు. 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది అతి విలువైన 64 పరుగులు జట్టుకు జోడించాడు. అదే చివరకు హైదరాబాద్ విజయానికి కారణమయింది.
వీర విహారంతో...
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టులో అందరూ విఫలమయినా నితీష్ రెడ్డి మాత్రం నిలబడి ఆడాడు. చివరకు సన్ రైజర్స్ 182 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ జట్టు బౌలర్లు కట్టడి చేయగలిగారు. భువనేశ్వర్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీసినా మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీసి సహకరించారు. చివరకు రెండు పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ విజయానికి మాత్రం మన తెలుగు కుర్రోడు కారణమవ్వడం అందరికీ గర్వకారణం. అందుకే మన హైదరాబాద్ గెలవడం... అదీ మన తెలుగోడు గెలిపించడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


Tags:    

Similar News