IPL2024 : బ్యాట్ కు బంతి భారమయిందిగా... అసలు ఎటు పోతుందో తెలిస్తేగా.. అట్లా ఉంది మ్యాచ్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై సాధించిన విజయంతో మరో హిస్టరీని సృష్టించింది

Update: 2024-04-16 04:04 GMT

ఐపీఎల్ హిస్టరీని క్రియేట్ చేసుకున్న ఆ జట్టే మళ్లీ తిరగరాసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తాను ఐపీఎల్ లో సాధించిన స్కోరును తానే అధిగమించి రికార్డును క్రియేట్ చేసింది. గతంలో ముంబయి జట్టు మీద 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఔరా అనినిపించుకుంది. కానీ నేడు అదే జట్టు బెంగళూరు రాయల్స్ మీద 287 పరుగులు చేసి నోరు వెళ్ల బెట్టేలా చేసింది. ఇది టీ 20 యా? లేక వన్డే ఆడుతున్నారా? అన్నంత గా స్కోరు చేసిందంటే హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టును మెచ్చుకోకుండా ఉండలేం. ఒకసారి ఎక్కువ పరుగులు చేస్తే అది బౌలర్ల విఫలమని భావించవచ్చు. అదే రెండో సారి కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశారంటే సన్ రైజర్స్ లో సత్తా ఏపాటిదో ఈపాటికే అర్థమవుతుంది.

పేరున్న జట్లనే...
రెండు జట్లు హేమాహేమీలే. తొలి జట్టు ముంబయి ఇండియన్స్ కాగా, రెండో జట్టు బెంగళూరు రాయల్స్. కీలక జట్లపైనే ఈ స్కోరు చేయడంతో ఇక ఆ జట్టుకు తిరుగులేదన్న రీతిలో ఐపీఎల్ లో తన ప్రయాణం సాగిస్తుంది. గతంలో కొన్ని సీజన్ లలో అట్టడుగు స్థాయిలో ఉన్న సన్ రైజర్స్ జట్టు మాత్రం ఈ సీజన్ లో ఇరగదీసి ఆడుతుంది. రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. అయితే బెంగళూరు జట్టు కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లు ఆటలో పెర్‌ఫార్మెన్స్ చూపించింది.
పెద్ద లక్ష్యమైనా...
288 పరుగుల లక్ష్యమైనా ఆ జట్టు ఓడిపోయింది కేవలం 25 పరుగుల తేడాతోనే అంటే.. ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. డుప్లిసెస్, కోహ్లి, దినేష్ కార్తీక్ లు తమ బ్యాట్ కు పనిచెప్పడంతో 262 పరుగుల చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ లో హెడ్ కేవలం 39 పరుగుల్లో సెంచరీ సాధించాడంటే ఎలా ఊచకోత కోశాడో చెప్పాల్సిన పనిలేదు. అలాగే క్లాసెన్ కూడా 31బంతుల్లో 67 పరుగులు చేశఆడు., సమద్ 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ 32 పరుగులు చేశాడు. ఇలా జట్టును 287 పరుగులకు చేర్చడంతో విజయం సన్ రైజర్స్ కు దాదాపు ఖాయమయింది.
బెంగళూరు జట్టు కూడా...
సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. తర్వాత 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఆరంభం అదిరిపోయింది. కొహ్లి ఇరవై బంతుల్లో 42 పరుగులు చేసి అవుటయ్యాడు. డుప్లెసిస్ 28 పరుగుల్లో 62 పరుగులు చేశాడు, తర్వాత వరసగా అవుటయినా దినేశ్ కార్తీక్ ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో కేవలం 35 పరుగుల్లో 85 పరుగులు చేశఆడు. అయినా జట్టు ఇరవై అయిదు పరుగుల తేడాతో ఓటమిపాలయింది. రెండుజట్లను మెచ్చుకోకుండా ఫ్యాన్స్ ఉండలేని పరిస్థితి. మ్యాచ్ అంటే అలా ఉండాలనిపించేలా నిన్నటి మ్యాచ్ జరిగింది.


Tags:    

Similar News